రోహిత్ శర్మ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు ఒక్క రోహిత్ శర్మకే సొంతమైంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే చాలు రోహిత్ శర్మ జూలు విదుల్చుతాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతాడు. అలాంటి రోహిత్ శర్మ వన్డే క్రికెట్ కెరీర్లో ఈరోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా ఆరేళ్ల క్రితం వన్డేల్లో రోహిత్ శర్మ తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు. రోహిత్ తన తొలి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియాపై నవంబర్ 2, 2013న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. ఆ తర్వాత శ్రీలంకపై రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. అయితే, తొలి డబుల్ సెంచరీ ఎప్పటికీ ప్రత్యకమే. రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీకి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా ఐసీసీ ట్విట్టర్లో అభిమానులకు ఈ సంగతిని మరోసారి గుర్తు చేసింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ డబుల్ సెంచరీపై ప్రత్యేక కథనం. 2013లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నవంబర్ 2న జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్శర్మ(209), శిఖర్ధావన్(60) చెలరేగి ఆడటంతో తొలి వికెట్కు మంచి శుభారంభాన్నిచ్చారు. జట్టు స్కోరు 112 పరుగుల వద్ద శిఖర్ ధావన్ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(28), యువరాజ్ సింగ్(12) నిరాశపరించారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ మాత్రం ధోనీ(62; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు)తో కలిసి టీమిండియాకు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. 49వ ఓవర్ మూడో బంతికి మెక్కే బౌలింగ్లో భారీషాట్ ఆడబోయిన రోహిత్ హెన్రిక్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించాడు. మరోవైపు ధోనీ కూడా దూకుడుగా ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. అనంతరం చేధనలో ఆస్ట్రేలియా జట్టు 326 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత రోహిత్ ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 సాధించాడు. ఆ తర్వాత డిసెంబర్ 13, 2017న శ్రీలంకపై మళ్లీ మోహాలి వేదికగా జరిగిన మ్యాచ్లో మరోసారి డబుల్ సెంచరీ (208) చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తొలి నాలుగు డబుల్ సెంచరీలు చేసింది భారత క్రికెటర్లే కావడం విశేషం. తొలుత సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) సఫారీలపై తొలి డబుల్ సెంచరీ చేయగా, ఆ తర్వాత 2011లో వెస్టిండిస్పై సెహ్వాగ్(218) డబుల్ సెంచరీ సాధించాడు.