మెల్బోర్న్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 17.4 ఓవర్లలోనే ఛేదించింది. ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్(50 బంతుల్లో 57, 4 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఈ సిరిస్లో మొత్తం 217 పరుగులు చేసిన వార్నర్ను మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వరించింది. తొలి టీ20లో వార్నర్ సెంచరీతో చేలరేగిన సంగతి తెలిసిందే. ఇక, బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సైతం హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కుశాల్ పెరీరా (57) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, రిచర్డ్సన్, ప్యాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య చేధనలో ఓపెనర్లు ఆరోన్ ఫించ్(37), వార్నర్ (57) చక్కటి శుభారంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు 69 పరుగులు జోడించిన తర్వాత లాహిరు కుమార బౌలింగ్లో ఆరోన్ ఫించ్ ఔటయ్యాడు. ఫించ్ ఔటైన కొద్దిసేపటికే స్టీవ్ స్మిత్ (13), బెన్ మెక్డోర్మెట్ (5) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. చివర్లో ఆష్టన్ టర్నర్(22 నాటౌట్) చెలరేగడంతో ఆస్ట్రేలియా అలవోక విజయాన్ని నమోదు చేసింది.