బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ను గత పది నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవినీతి నిరోధక శాఖ విచారిస్తున్న విషయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ స్పష్టం చేశారు. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. షకీబ్ రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పలేదు. అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్లోని మూడు చార్జ్లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్కు శిక్షను ఖరారు చేసింది. అయితే ప్రపంచ క్రికెట్ను నివ్వెరపరిచిన ఈ వ్యవహారం బీసీబీకి తెలియకుండానే సాగడంతో ఐసీసీ చాలా గోప్యత పాటించిందని తెలుస్తోంది. దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ "జనవరి నుంచి షకీబల్పై ఐసీసీ చేస్తున్న విచారణ గురించి నాతోపాటు బీసీబీలోని ఏ ఒక్కరికీ తెలీదు. ఏసీయూ నేరుగా షకీబల్తోనే మాట్లాడింది. ఇటీవలి ఆటగాళ్ల సమ్మెపై మాతో జరిపిన చర్చల సందర్భంగానే షకీబల్ ఈ విచారణ గురించి చెప్పాడు" అని తెలిపాడు.