ప్రతి ఒక్కరి శరీరంలో జన్యు కణాలను గుర్తించేందుకు డీఎన్ఏ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పాకిస్థాన్ లో ఓ యువతి మృతదేహంలో యువకుడికి సంబంధించిన డీఎన్ఏ కణాలను గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్ కాలేజిలో నిమృత కుమారి ఫైనల్ ఇయర్ చదువుతోంది. నిమృత చాలా యాక్టివ్ గా ఉండేది. ఏమైందో ఏమో తెలియదు కానీ సెప్టెంబర్ 16 వ తేదిన తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో డీఎన్ఏ పరీక్షల కోసం ఆమె మృతదేహాన్ని జంషోరూ ఫోరెన్సిక్ ల్యాబొరేటరికి పంపించారు.
ఈ పరీక్షల్లో సంచలన నిజం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ అధికారి మసూద్ బంగాళ్ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే.. "నిమృతా ఆత్మహత్య చేసుకుందన్న కోణంలో మేం విచారించాం. కానీ డీఎన్ఏలో అబ్బాయికి సంబంధించిన డీఎన్ఏ వివరాలు బయటికి వచ్చాయి." అని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న నిమృత కుటుంబ సభ్యులు నిమృతది ఆత్మహత్య కాదు హత్య అని సింధ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు తెలుసుకున్న న్యాయస్థానం జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
సెప్టెంబర్ లో కాలేజిలో హిందువులకు, మైనారిటిలకు సంబంధించి ప్రిన్సిపాల్ తో గొడవ జరిగింది. ఈ గొడవలో నిమృత ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. నిమృత తోటి విద్యార్దులైన మెహ్రాన్ అబ్రో, అలీషాన్ మెమన్లను పోలీసులు అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. నిమృత సోదరుడు విశాల్ దీని పై స్పందించారు. తన సోదరిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్యేనని అన్నారు. ఆమెను ఎవరో వెనుక నుంచి బలవంతంగా పట్టుకున్న గుర్తులున్నాయన్నారు. నిమృత, మెహ్రాన్ అబ్రో ప్రేమించుకుంటున్నారని శారీరకంగా కూడా దగ్గరైనట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. నిమృతా పెళ్లి చేసుకోవాలని కోరడంతో అబ్రో నిమృతను చంపాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి యువతి శవంలో అబ్బాయి డీఎన్ఏ రావడం సంచలనంగా మారింది.