కోల్కత్తాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి డేనైట్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లకు ఇది తొలి డేనైట్ టెస్టు మ్యాచ్. ఈ టెస్టు మ్యాచ్పై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విటర్లో కామెంట్ చేశాడు. అయితే ట్విట్టర్లో ఎప్పుడు చురుగ్గా ఉండే ప్రముఖ వ్యాఖ్యాత మైఖేల్ వాన్ కాస్త వ్యంగంగా ట్వీట్ చేయడం విశేషం. బంగ్లాదేశ్తో డేనైట్ టెస్టు ఆడేందుకు భారత్ ఒప్పుకుంది. వచ్చే ఏడాది ఆసీస్ పర్యటనలో ఒకటి లేదా రెండు డేనైట్ టెస్ట్ మ్యాచ్లు ఆడేందుకు అంగీకరిస్తుంది. గతేడాది భారత్ను ఆస్ట్రేలియా అడిలేడ్లో డేనైట్ టెస్టు ఆడమని కోరింది. అయితే టీమిండియా ఆసీస్ అభ్యర్థనను తిరస్కరించింది. అప్పటి ఘటనను గుర్తుచేస్తూ.. ఇప్పుడు టీమిండియాను ఉద్దేశించి వాన్ ట్వీట్ చేయడంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐసీసీ నిషేదానికి గురైన బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబుల్ హసన్పై కూడా వాన్ స్పందించారు. 'షకీబుల్పై ఎలాంటి సానుభూతి అవసరం లేదు. అతడు తప్పు చేశాడు. ప్రతిఫలంగా శిక్ష అనుభవించాడు. ఈ ఘటన యువ క్రికెటర్లకు ఓ పాఠం. నిబంధనలు పాటించకపోతే ఎలాంటి పరిస్థితి వస్తుందో అందరికి అర్ధం అయింది. షకీబుల్పై విధించిన రెండేళ్ల నిషేధం సరిపోదు, ఇంకా ఎక్కువ కాలం విధించాల్సింది' అని మరో ట్వీట్ చేసారు. భారత్, బంగ్లాదేశ్ మినహా టెస్టు హోదా కలిగిన జట్లన్నీ ఇప్పటికే డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడాయి. ఆసీస్ డేనైట్ టెస్టు మ్యాచ్ ఆడుదామని అడిగినా.. భారత్ ఆడలేదు. ఏవేవో సాకులు చెపుతూ టీమిండియా ఇప్పటి వరకూ పింక్బాల్ మ్యాచ్లు ఆడలేదు. అయితే బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన వారంలోనే బీసీసీఐ డేనైట్ టెస్టులకు ఓకే అంది. దాదా బీసీసీఐ పగ్గాలు అందుకున్న వెంటనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సంప్రదించి.. ఈడెన్లో డేనైట్ మ్యాచ్ ఆడాలని కోరాడు. బంగ్లా బోర్డు అంగీకారం తెలపడంతో.. నవంబర్ 22 నుంచి 26వరకు కోల్కతాలో భారత్-బంగ్లాదేశ్ జట్లు తొలిసారి డేనైట్ టెస్టు మ్యాచ్ను ఆడనున్నాయి.