ఏపీలోని ఇసుక కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్శిస్తున్న జగనసేన అధినేత పవన్ కళ్యాణ్... ఈ విషయంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం విశాఖలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ చేపట్టాలని నిర్ణయించిన పవన్ కళ్యాణ్... దీనికి ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమానికి వామపక్షాలు, బీజేపీ మద్దతు ప్రకటించాయి. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను ఫోన్ చేసి కోరారు. ఇందుకు కన్నా కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. దీంతో బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ చేపట్టే లాంగ్ మార్చ్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పాటు వామపక్షాలను కూడా ఈ లాంగ్ మార్చ్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటే... ఈ రెండు పార్టీల మధ్య స్నేహం మొదలైనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ... ఇందుకోసం జనసేన మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. టీడీపీతో మళ్లీ స్నేహం చేయడం వల్ల రాజకీయంగా తమకు లాభం ఉండదనే భావనలో ఉన్న బీజేపీ... జనసేనతో మైత్రి కారణంగా తమకు లబ్ది చేకూరుతుందని భావిస్తోందని సమాచారం.