అంతర్జాతీయ క్రికెట్ నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ అయిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ ఎంసీసీ(మార్లిబోన్ క్రికెట్ క్లబ్) ప్రపంచ క్రికెట్ కమిటీ నుండి తప్పుకున్నాడు. ఈ మేరకు మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) విడుదల చేసిన ప్రకటనలో ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ నుంచి షకీబ్ తప్పుకున్నట్లు పేర్కొంది. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో షకీబ్ ఉల్ హాసన్ అక్టోబర్ 2017లో చేరాడు. సిడ్నీ, బెంగళూరు వేదికగా జరిగిన రెండు మీటింగ్లకు షకీబ్ హాజరయ్యాడు. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు అంపైర్లు ఉంటారు. క్రికెట్లో ఉన్న సమస్యలపై చర్చించడానికి ప్రతి ఏటా రెండుసార్లు ఈ కమిటీ సమావేశమవుతుంది. ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ తదుపరి మీటింగ్ మార్చి 2020లో శ్రీలంక వేదికగా జరగనుంది. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు.