జగన్ కేబినెట్లోని మంత్రులు అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసి పది కోట్లు ఖర్చు పెట్టారని మంత్రి పేర్నినాని మాట్లాడుతున్నారని, బాబు ఢిల్లీ దీక్షకు కేవలం రూ. 1కోటి 60 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని స్పష్టం చేశారు. సోమవారం ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరకు తాను వస్తానని.. పది కోట్లు ఖర్చు అయిందని నిరూపిస్తారా? అని వర్ల రామయ్య మంత్రికి సవాల్ విసిరారు.
రూ. 48 లక్షలతో సీఎం ఇంట్లో బాత్రూమ్కి ఖర్చు పెట్టారని, సీఎం క్యాంప్ కార్యాలయానికి రూ.15 కోట్లు ఖర్చు పెట్టారని వర్ల రామయ్య అన్నారు. సీఎం పదవి అయిపోయిన తర్వాత ఆ క్యాంప్ ఆఫీస్ను కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్న సీఎం జగన్ రూ. 60 లక్షలు ఎలా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని వర్ల ప్రశ్నించారు. సీబీఐ కేసులు వైఎస్ కుమారుడు జగన్పై నమోదు అయ్యాయని, సీఎం జగన్పై కాదన్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తాను సచివాలయానికి వచ్చి బాబు దీక్షకు ఎంత ఖర్చు అయిందో నిరూపిస్తానని అన్నారు. మరి మంత్రి పేర్ని నాని సోమవారం వస్తారా? పలాయనం చిత్తగిస్తారో చూస్తానని వర్ల రామయ్య అన్నారు.