మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ ఎమ్మెల్యే అభ్యర్థిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన అమరావతి జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్వాభిమాని పక్ష పార్టీ తరపునతాజా ఎన్నికల్లో మోర్షి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న దేవేంద్ర భుయార్ ఎన్నికల సమయం కావటంతో సోమవారం తెల్లారుజామున తన పరివారంతో ఇంటి నుంచి బైటకు వచ్చారు. కొందరు కార్యకర్తలతో కలిసి కారులో వెళ్తున్న ఆయనని బైక్పై వెంబడించిన ముగ్గురు దుండగులు వాహనంపై కాల్పులు జరపడంతో షడన్ బ్రేకులు వేసి కారుని నిలపి వేసారు. దీంతో కారుపై దాడికి దిగిన దుండగులు దేవేంద్ర భుయార్ను కారు నుంచి బయటికి లాగి దాడి చేశారు. ఆపై ఆయన కారుకు నిప్పంటించి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భుయార్ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు ఆయన అనుచరులు. ప్రస్తుతం దేవేంద్ర భుయార్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు