మరోసారి పెద్ద నోట్లను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఇప్పుడు. సామాజిక మీడియాలో ఇదే చర్చ హాట్ టాపిక్గా మారింది. ఇటీవల సమాచారం హక్కు చట్టం ద్వారా రిజర్వు బ్యాంక్ను అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 నోట్ను ఒక్కటంటే ఒక్కటి ముద్రించలేదని చెప్పడమే ఈ అనుమానాలకు తావిస్తున్నది.
2016-17లో 3,542.991 మిలియన్ల(354.29 కోట్ల) రూ.2వేల నోట్లను ప్రింటింగ్ చేసినట్లు వెల్లడించిన రిజర్వు బ్యాంక్ 2017-18లో 11.15 కోట్ల నోట్లను ముద్రించగా..ఆ తర్వాతి సంవత్సరంలో దీనిని 4.66 కోట్లకు తగ్గించింది. 2019-20లో తొలి ఆరు నెలలు పూర్తైనప్పటికీ ఒక్క రూ.2 వేల నోటు ముద్రించలేదని పేర్కొంది. మార్చి 2018 నాటికి 336.3 కోట్లుగా ఉన్న అత్యంత విలువైన నోట్ల చలామణి..మొత్తం కరెన్సీలో ఈ వాటా 3.3 శాతంగా ఉండగా, విలువ పరంగా చూస్తే 37.3 శాతం. మార్చి 2019 నాటికి ఇది 329.10 కోట్లకు తగ్గగా, మొత్తం కరెన్సీలో ఇది 3 శాతానికి, విలువలో 31.2 శాతానికి పడిపోయింది. దీంతో రూ.2 వేల నోట్ల చలామణి క్రమంగా తగ్గుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించిన సమాచారం మేరకు తెలిస్తోంది.
అయితే ఇందుకు ప్రధాన కారణం రూ.2 వేల విలువైన నోట్ ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు, అక్రమ రవాణా మరింత సులభతరం అవుతున్న నేపథ్యంలో నకిలీ నోట్లు గుట్టలు గుట్టలుగా లభ్యమవుతున్నాయి. దీనినితయారు చేయటం కష్టమని రిజర్వు బ్యాంకు ఎన్ని బీరాలు పలికినా ఎక్కడికక్కడ ఒరిజినల్ని తలదన్నే తీరుగా నకిలీ మలికి కనిపిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ర్టాల సరిహద్దులో రూ.6 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గడిచిన మూడేండ్లలో రూ.50 కట్లో విలువైన నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారన్నది అధికారిక లెక్కలు చెపుతున్నాయి.
నల్లధనాన్ని నిర్మూలించడానికి మూడేండ్ల క్రితం రూ.500, రూ.1,000 పాత పెద్ద నోట్లను రద్దుచేసి సంచలన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ సర్కార్.. ఆ తర్వాత వీటి స్థానంలో రూ.500, రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టినా ఫలితాలు కానరావటంలేదు. నల్లధనాన్ని నిర్మూలించాలంటే మరోమారు అధిక విలువైన నోట్ల చలామణిని రద్దు చేయాలని విశ్లేషకులు ప్రధానికి సూచిస్తున్నారు.