అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తేదీలు ఖరారయ్యాయా ? బిజెపి నేతల మాటల్ని వింటుంటే ఇదంతా ఓ ప్లాన్లో భాగంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయోధ్య వివాదంపై సుదీర్ఘకాలంపాటు జరిగిన విచారణ బుధవారంతో ముగియగా.. సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. అయితే నవంబర్ 17వ తేదీలోకా తీర్పు వెలువడడం ఖాయమన్న ఊహాగానాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం బలంగానే వుంది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, అయోధ్య కేసును విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం సారథి రంజయ్ గొగోయ్ నవంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. హిస్టారికల్ తీర్పు కాబట్టి ఆయన రిటైర్మెంట్కి ముందే తీర్పు వెలువరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభమయ్యే తేదీలపై బిజెపి నేతలు ప్రకటనలు ప్రారంభించారు.
డిసెంబర్ 6నే ముహూర్తం ? అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వెల్లడించారు. రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో సాక్షి మహారాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుదవారం ఆయన ఉన్నావోలో మీడియాతో మాట్లాడుతూ..1992 డిసెంబర్ 6వ తేదీనే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేశారని, మసీదు నిర్మాణం కూల్చి వేసిన తేదీనే ఆలయ నిర్మాణం ప్రారంభం కావడం విశేషమని సాక్షి మహారజ్ పేర్కొన్నారు.