శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ వాయిదా పడింది. అనివార్యకారణాల వల్ల ఈ భేటీ 14వ తేదీకి వాయిదా పడిందని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది.
చిరంజీవితోపాటు ఆయన తనయుడు చిత్ర నిర్మాత హీరో రాంచరణ్ కూడా జగన్ని కలవటంతో పాటు చిరంజీవి తను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ను వీక్షించాల్సిందిగా కోరేందుకే ఈ భేటీ జరగనున్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి ఆయనను తొలిసారి కలవనుండడంతో సర్వత్ర చర్చ మొదలైంది. జగన్తో చిరంజీవి భేటీ సందర్భంగా తెలుగు తొలి స్వాతంత్య్ర సమరయోధునికి సంబంధించిన సినిమాకు పన్నురాయితీ ఇవ్వాలని కోరే అవకాశం ఉందని మెగాభిమానుల నుంచి వస్తున్న మాట. మరి ఏం జరగనుందో చూడాలంటే 14 వరకు వేచి చూడక తప్పదు.