ఇరాక్లో ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు చెలరేగాయి. బగ్దాద్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. గత మూడు రోజులుగా భీకర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని అదిల్ ప్రయత్నించారు. రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలన్నారు. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు సహకరించాలని ప్రధాని కోరారు. అయితే అల్లర్లలో సుమారు 34 మంది మృతి చెందారు. మరో 1500 మంది వరకు గాయపడ్డారు. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ వరుసగా మూడో రోజు కూడా ప్రజలు వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
ప్రధాన మంత్రి అదిల్ అబ్దెల్ మహ్దీ గురువారం రాజధాని బాగ్దాద్లో ఆంక్షలు విధించినా నిరసనకారులు ఏమాత్రం లెక్కచేయలేదు. దేశ చిహ్నమైన లిబరేషన్ స్క్వేర్ వద్దకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ మోహరించిన పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. వందల సంఖ్యలో జనం గాయపడగా దవాఖానలకు తరలించారు. కాగా ప్రభు త్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. మంగళవారం బాగ్దాద్లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా షియా ప్రాబల్య నగరాలకు వ్యాపించాయి. గురువారం పలు చోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.