పాక్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ ఓ ఇంటివాడయ్యాడు. భారత్కు చెందిన యువతి షామియా అర్జూతో ఆయన వివాహం దుబాయిలో మంగళవారం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన వివాహ వేడుకకు హసన్ భారత్, పాక్ క్రికెటర్లను ఆహ్వానించాడు. భారత్ క్రికెటర్లు తన వివాహ వేడుకకు హాజరైతే తానెంతో సంతోషించేవాడినన్నాడు. అయితే, భారత్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. పాక్ నుంచి షాదాబ్ ఖాన్ మాత్రమే హాజరయ్యాడు. మాజీ కెప్టెన్ మిస్బా వుల్ హక్ నేతృత్వంలో జరుగుతున్న శిక్షణ క్యాంప్లో ఉన్నందున వారంతా ఈ వివాహ వేడుకు హాజరు కాలేకపోయారు.
షామియా హరియాణాకు చెందిన యువతి. ఆమె కుటుంబం దిల్లీలో స్థిరపడింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో ఫ్లైట్ ఇంజినీర్గా పనిచేస్తోంది. గతంలో దుబాయిలో జరిగిన ఓ విందులో షామియాకు హసన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. షామియా నిజాయతీ నచ్చడంతో హసన్ ఆమెకు పెళ్లి ప్రతిపాదన పంపగా.. అందుకు ఆమె అంగీకరించింది. దీంతో దుబాయిలో పెళ్లి బాజాలు మోగాయి. మరోవైపు, హసన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభినందనలు తెలిపింది. ఈ వివాహంతో భారత అమ్మాయిల్ని పెళ్లిచేసుకున్న నాలుగో పాక్ క్రికెటర్గా హసన్ నిలిచాడు. గతంలో జహీర్ అబ్బాస్, మొహిన్ ఖాన్, షోయబ్ మాలిక్ భారత అమ్మాయిలను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హసన్ తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు, 53 వన్డేల్లో ఆడాడు.