మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ప్రియవ్రత్ సింగ్కు మంగళవారం ఓ ఇబ్బందికర పరిణామం ఎదురైంది. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా కరెంటు పోయింది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నది కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన విజయాల గురించి.
మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతుండగా కరెంటు కోతతో అంతరాయం ఏర్పడింది. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ఒక నిమిషంలో మళ్లీ సజావుగా కరెంటు సరఫరా జరిగింది. దీని వెనకాల ఏదో కుట్ర ఉండి ఉండొచ్చు. ఇది నిజంగా కరెంటు కోత అయితే ఒక నిమిషంలో ఎక్కడైనా వస్తుందా?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్ రంగ సంస్థలు తీవ్ర నష్టాలతో ఉన్నాయని, దానికి గతంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వ చర్యలే కారణమని ఆరోపించారు.