బంగారం.. ముట్టుకుంటే భగ్గుమంటోంది. ధర చూస్తే అదిరిపోతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆల్ టైం రికార్డులను తిరగదోడుతోంది. నిన్న మొన్నటి వరకు 10 గ్రాములకు రూ. 37 నుంచి రూ.38 వేల వరకే ఉన్న బంగారం.. ఇప్పుడు రూ.40 వేల వైపు చూస్తోంది. మంగళవారం నాటి బులియన్ మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.200 పెరిగి, రూ.38,770 వద్ద ఆల్టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గకపోవడంతో బంగానం ధర అంతకంతకూ పెరుగుతోందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వెండి ఏకంగా రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది. అయితే అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నా.. దేశీయంగా బంగారం ధర మాత్రం పెరుగుతుంది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం రూ.38,770కు చేరింది. గత శనివారం 10గ్రాముల బంగారం రూ.38,670కు చేరి ఆల్టైమ్ రికార్డు ధరను నమోదు చేయగా, నేడు ఆ రికార్డు బ్రేక్ అయ్యింది.