ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2లో నేడు కీలక ఘట్టం చోటుచేసుకుంది. చంద్రయాన్-2 వాహకనౌకను ప్రయోగించిన 29 రోజుల తర్వాత ఈ వాహకనౌక చందమామ కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఇస్రో శాస్త్రవేత్తలు ఈరోజు ఉదయం 9.02 గంటలకు ఈ క్రతువును ప్రారంభించి 1738 సెకన్ల పాటు కొనసాగించారు. ‘మేక్ ఆర్ బ్రేక్’గా వ్యవహరించే ఈ ప్రక్రియను పూర్తి చేశారు.ఈ సందర్భంగా చంద్రయాన్-2 వేగాన్ని తగ్గించిన శాస్త్రవేత్తలు.. వాహకనౌకను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. ఇందుకోసం నౌకలోని ద్రవ ఇంజిన్ ను మండించారు. ఈ నెల 21, 28, 30 ల్లో ఇదే తరహా ప్రక్రియను చేపట్టి వాహకనౌకను చంద్రుడికి 150 కిలోమీటర్ల సమీపానికి తీసుకెళతారు.ఈ వాహకనౌకలోని ల్యాండర్ వచ్చే నెల 7న చంద్రుడిపై ల్యాండ్ కానుంది. అనంతరం అందులోని రోవర్ ముందుకు దూసుకుపోనుంది. అనంతరం అక్కడి ఖనిజాలను, ఇతర వనరులను విశ్లేషించి సమాచారాన్ని ఆర్బిటర్, ల్యాండర్ ద్వారా భూమికి చేరవేయనుంది.కాగా జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా చంద్రయాన్-2ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.