ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఒక శునకం తన యజమానిని భల్లూకం(ఎలుగుబంటి) బారి నుంచి కాపాడింది. ఈ అనుభవం మడావరా పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారా పంచాయతీకి చెందిన మున్నాలాల్కు ఎదురైంది. 60 ఏళ్ల మున్నాలాల్ పశువులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ సమయంలో అతని వెంట పెంపుడు కుక్క కూడా ఉంది. ఇంతలో ఒక భల్లూకం అటుగా వచ్చి, అతనిపై దాడి చేసింది. దీంతో అతను గట్టిగా ఆర్తనాదాలు చేశాడు. ఈ అరుపులు విన్న అతని పెంపుడు శునకం పరిగెత్తుకుంటూ వచ్చి, ఎలుగుబంటిపై దాడికి దిగింది. ఈ దాడిలో గాయపడిన ఆ భల్లూకం అక్కడి నుంచి పారిపోయింది. ఎలుగు దాడిలో తీవ్రంగా గాయపడిన మున్నాలాల్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడిని మడావరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మున్నాలాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.