ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిఎం కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ అరెస్ట్‌

national |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 11:12 AM

రూ.354 కోట్ల మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మోసం చేసిన కేసులో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పురిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ లాండరింగ్‌ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద సోమవారం రాత్రి అరెస్టు చేసిందని ఈడీ అధికారులు తెలిపారు. మంగళవారం రతుల్‌ పురిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నమోదు చేసిన కేసుకు సంబంధించి మోజర్‌ బేర్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రతుల్‌ పురి, ఇతరులపై సిబిఐ సోమవారం కేసు నమోదు చేసింది. నిందితులైన మాజీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాలపై సిబిఐ గత ఆదివారం దాడులు చేపట్టింది.


నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణల కింద రతుల్‌, రతుల్‌ కంపెనీ, రతుల్‌ తండ్రి, మేనిజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ పురి, ఇతర డైరెక్టర్లు నీతాపురి (రతుల్‌ తల్లి, కమల్‌నాథ్‌ సోదరి), సంజరు జైన్‌, వినీత్‌ శర్మలపై కేసులు నమోదు చేసింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి రతుల్‌ 2012 లో రాజీనామా చేయగా, రతుల్‌ తల్లిదండ్రులు బోర్టులు కొనసాగుతున్నట్టు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. కాంపాక్ట్‌ డిస్క్‌లు, డీవీడీలు, సోలిడ్‌ స్టేట్‌ స్టోరేజ్‌ డివైజ్‌లు వంటి ఆప్టికల్‌ స్టోరేజ్‌ ఉత్పత్తులను రతుల్‌ పురి కంపెనీ తయారు చేస్తూ వచ్చింది. 2009 నుంచి వివిధ బ్యాంకుల నుంచి చాలాసార్లు ఆ కంపెనీ రుణాలు తీసుకుని, వాటిని చెల్లించకపోవడంతో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపి అది 'ఫ్రాడ్‌' అకౌంట్‌గా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లతో ఆ కంపెనీ డైరెక్టర్లు బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్టు ఆరోపించింది. దీంతో 2014 నవంబర్‌ 29 వరకూ రూ.354.51 కోట్ల మేరకు తమకు నష్టం వాటిల్లిందని బ్యాంకు ఫిర్యాదు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com