మహారాష్ట్రను ముంచెత్తిన వరదలతో సుమారు 3.79 లక్షల మంది ప్రజలు 432 తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో దెబ్బతిన్న ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)కింద పునర్నిర్మిస్తామని, అద్దె ఇళ్ల లో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. సోమవారం వరద బీభత్సంపై ఏర్పడిన కేబినెట్ సబ్-కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల్లో చిక్కుకుని నష్టపోయిన గ్రామీణ ప్రాంతంలో అద్దె ఇళ్లలో ఉన్నవారికి రూ.24,000, పట్టణ ప్రాంతాల్లోని అద్దె ఇళ్ల లో ఉన్నవారికి రూ.36,000 వంతున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వరద బాధితుల సహాయార్ధం రూ.5 కోట్లు విరాళమిచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.