ఆర్టికల్ 370 రద్దును జీర్ణించుకోలేకపోతున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ యుద్ధ నినాదాలు చేశారు. భారత్తో యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, అమీతుమీ తేల్చుకుంటామని హెచ్చరించారు. మోదీ చేయరాని తప్పు చేశారని, బీజేపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతుందని అన్నారు. పాక్ స్వాతంత్ర్య దినం సందర్భంగా ఆయన ఈ రోజు పాక్ ఆక్రమిత కశ్మీర్ చట్టసభలో ప్రసగించారు.
మూల్యం చెల్లించాల్సి ఉంటుంది..
‘‘భారత్ చేయరాని తప్పు చేసింది. కశ్మీర్కు స్వాతంత్ర్యం సాధించడానికి భారత్తో యుద్ధానికైనా మేం సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోదీ ఫైనల్ కార్డును వాడాడు. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆరెస్సెస్ ముస్లింలపై మూక దాడులను రెచ్చగొడుతోంది. కశ్మీర్ అంశాన్ని మేం ప్రతి అంతర్జాతీయ వేదికపైనా లేవనెత్తుతాం. భారత్, పాక్ మధ్య యుద్ధం వస్తే దానికి ప్రపంచమే బాధ్యత వహించాల్సి ఉంటుంది…’ అని ఖాన్ అన్నారు. భారత్ దుడుకుగా స్పందిస్తే పాక్ సైన్యం, ప్రజలు దీటుగా బదులిస్తున్నారని, ఇటుకలతో రాళ్లతో సమాధానం చెబుతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికల్లో తానే స్వయంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతాన్న ఇమ్రాన్ పాక్ ఆర్మీ అంతా గమనిస్తోందని హెచ్చరించారు.