రాఖీ పూర్ణిమ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. ఆగస్టు 15న దిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కు చెందిన అన్ని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో మహిళలంతా ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.
దిల్లీ పరిధిలో డీటీసీ బస్సులు సహా మెట్రో రైళ్లలో ఎప్పటికీ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు నెలల కిందట ప్రతిపాదించారు. దీనివల్ల మహిళలు సులభంగా ఏ ఆటంకం లేకుండా పూర్తి భద్రతతో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఎక్కువ ప్రయాణ ఛార్జీల వల్ల కొందరు మహిళలు, యువతులు కొన్ని రకాల రవాణా సాధనాలకే పరిమితమవుతున్నారని గత జూన్ 3న అన్నారు. ఈ ప్రతిపాదన సాధ్యా సాధ్యాలపై సమీక్షించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.