హైదరాబాద్ : ఉత్తరాఖండ్లో వరదలు పోటెత్తాయి. వరద ఉధృతికి చమోలి జిల్లా రెండు నివాసాలు కూలిపోయాయి. ఇవాళ ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రూపాదేవీ(35), ఆమె 9 నెలల కూతురు మృతి చెందారు. ఇండ్లు కుప్పకూలిన సమయంలో రూపాదేవీ తన బిడ్డతో కలిసి నిద్రిస్తుంది. ఇక ఘటనాస్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో 21 ఏళ్ల మహిళ మృతి చెందింది. గత కొద్ది రోజుల నుంచి ఉత్తరాఖండ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు వరదలు పోటెత్తడమే కాకుండా కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం గడుపుతున్నారు.