భారత్తో వాణిజ్య బంధానికి స్వస్తి పలికిన పాకిస్థాన్ దాని ఫలితం అనుభవిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ భారత్పై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కశ్మీరీలకు సంఘీభావం ప్రకటిస్తూ భారత్తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పాక్ మేధావులే తప్పుబట్టినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే వారం రోజులు తిరగకముందే ఆ నిర్ణయం ఎంత తప్పో పాకిస్థాన్కు తెలిసొస్తోంది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి వస్తువులను ఎగుమతి చేసే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు, భారత్ నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకునే వస్తువుల సరఫరా ఆగిపోయింది. దీంతో అక్కడి ప్రజలు నిత్యావసరాలు దొరక్క, దొరికినా అధిక ధరలతో అల్లాడిపోతున్నారు. ఈ వారం రోజుల్లో అక్కడ కిలో టమాట రూ.300కి చేరిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గతవారం కిలో ఆలుగడ్డ రూ.10 ఉంటే.. ఇప్పుడది రూ.30కి చేరింది. మరికొన్ని రోజులు దాటితే అసలు కూరగాయలే దొరకని పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్ నుంచి టమాటాలు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, సోయాబీన్స్, చెప్పులు, పంచదార, ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వంటి వస్తువులను పాకిస్థాన్ దిగుమతి చేసుకుంటోంది. వీటి సరఫరా ఆగిపోవడంతో అక్కడ ఈ వస్తువుల ధరలన్నీ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.