భారత్, పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి రెండు దేశాలను కోరింది. కశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆర్టికల్ 370 రద్దుతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. కశ్మీర్ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు యూఎన్ చెప్పింది. రెండు వైపుల అందరూ సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్కు ప్రతినిధిగా చేస్తున్న స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. గత కొన్ని రోజులుగా కశ్మీర్లో పెరుగుతున్న ఉద్రిక్తత గురించి తాము ఆరా తీస్తున్నట్లు యూఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూపు వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికా కూడా కశ్మీర్ పరిస్థితిపై స్పందించింది. అరెస్టులు గురించి మాకు తెలిసిందని, అది ఆందోళన కలిగిస్తున్నదని, వ్యక్తిగత హక్కులను తెలుసుకుని వారికి ఎటువంటి భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు అమెరికా ప్రతినిధి మోర్గన్ ఒర్టాగుస్ తెలిపారు. అయితే కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాసలోని శాశ్వత సభ్య దేశాలకు తెలియజేసింది. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్ పరిణామాలను వివరించారు. జమ్ముకశ్మీర్లో సుపరిపాలన, రాష్ట్రంలో సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధికి అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన దోహదం చేస్తాయని వారికి వివరించారు.