భారీ భూకంపంతో దద్దరిల్లిన ఇండోనేసియాకు మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ హెచ్చరించింది. ఆ దేశ దక్షిణ తీర ప్రాంతమైన జావా ద్వీపంలో 52.8 కిలోమీటర్ల లోతులో, రాజధాని జకార్తాకు 150 కి.మీ దూరంలో సంభవించిన భూకంపం తీవ్రత 6.9గా నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.4గా నమోదైనట్లు ఇండోనేషియా డిజాస్టర్ ఏజెన్సీ తొలుత ప్రకటించింది. ఇది సునామీకి దారి తీయవచ్చని, సముద్ర అలలు పది అడుగుల మేర ఎగసిపడవచ్చని ఆ సంస్థ హెచ్చరించింది. జావా, సుమత్ర ద్వీపాల మధ్యనున్న సుందా జలసంధిలో సునామీ రావచ్చని, తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది. మరోవైపు భారీ భూప్రకంపనలకు జకార్తలోని అపార్ట్మెంట్ వాసులు భయాందోళన చెందారు. ఇండ్లను వీడి బయటకు పరుగులు తీశారు.