అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)ఆదేశాల మేరకు శుక్రవారం పాకిస్థాన్లోని భారత దౌత్యాధికారులు నౌకాదళ విశ్రాంత అధికారి కుల్భూషణ్ జాదవ్ను కలిసేందుకు ఆ దేశం అనుమతించింది. దీనికి సంబంధించి 10 రోజుల క్రితం ఐసీజే ఇచ్చిన ఆదేశాలను పాక్ పాటించకతప్పలేదు. అయితే దీనిపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. అలాగే ఈ రోజు సాయంత్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం.
కుల్భూషణ్ జాదవ్ తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారంటూ పాకిస్థాన్ సైనికులు 2016లో ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అక్కడి సైనిక న్యాయస్థానం 2017 ఏప్రిల్లో ఆయనకు మరణశిక్ష విధించింది. జాదవ్ గూఢచౌర్యానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పేర్కొంది. అయితే ఈ వాదనలను భారత్ ఖండించింది. భూషణ్ అసలు పాకిస్థాన్ వెళ్లనే లేదని, ఉద్యోగ విరమణ తర్వాత ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా అపహరణకు గురయ్యారని పేర్కొంది. దీనిపై భారత్ ఐసీజేను ఆశ్రయించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన విచారణలో న్యాయస్థానం పాక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.