పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రావల్పిండి సమీపంలో ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్లు సహా 17మంది మృతి చెంచారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నట్లు సమాచారం. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది
శిక్షణలో భాగంగా ఉదయం చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన విమానం రావల్పిండి నగర శివారులోని నివాస సముదాయాల్లో కుప్పకూలింది. ప్రమాదానికి ముందు కంట్రోల్ విభాగంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అయితే ప్రమాదానికి అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో చేపడుతున్నారు. నివాస ప్రాంతాల్లో విమానం చక్కర్లు కొట్టడం వల్లే... మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.