ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో బిహార్కు చెందిన జేడీ (యూ) ఎంపీ కౌసలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, చత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు ప్రత్యేకహోదా కోసం విజ్ఞప్తి చేశాయని ఆమె వెల్లడించారు. ప్రణాళిక మద్దతు కోసమే ‘హోదా’కు గతంలో ఎన్డీసీ (జాతీయ అభివృద్ధి మండలి) సిఫార్సు చేసేదని వివరించారు. ప్రత్యేకహోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ భాజపా మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ‘హోదా’ ఇచ్చే వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంటామని సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇటీవల దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అటు ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన, కాంగ్రెస్ కూడా గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తామని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన చర్చనీయాంశం కానుంది. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.