ఎయిరిండియాకు చెందిన ఒక పైలట్ తన చేతివాటం ప్రదర్శించటంతో తన ఉద్యోగాన్నికోల్పోవలసి వచ్చింది. 2019 జూన్ 22 వతేదీ శనివారం ఉదయం సిడ్నీ నుంచి ఢిల్లీ వచ్చే ఏఐ301 విమానం పైలట్ రోహిత్ భాసిన్ పర్సు దొంగిలించారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. భాసిన్ విమానం బయలు దేరటానికి కొద్ది నిమిషాల ముందు సిడ్నీ ఎయిర్ పోర్టు లోని ఓ డ్యూటీ ఫ్రీ షాపులోకి వెళ్లి తనకు నచ్చిన వాలెట్ ను దొంగిలించారని తెలిసింది. ఈసమాచారాన్ని ఆస్ట్రేలియా అధికారులు వెంటనే ఎయిర్ ఇండియాకు సమాచారం ఇచ్చారు. ఆస్ట్రేలియా అధికారుల సమాచారానికి స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.
పర్సు దొంగిలించిన విషయం నిజమని తేలటంతో భాసిన్ ఇండియాకు రాగానే సస్పెన్షన్ ఆర్డర్లు అందచేశారు. ఐడెంటిటీ కార్డును ఉన్నతాధికారులకు అప్పగించాలని, తమ లిఖిత పూర్వక అనుమతి లేకుండా భాసిన్ నివాస స్ధలమైన కొల్ కతా విడిచి వెళ్లరాదని ఆదేశించింది. అనుమతి లేకుండా ఎయిర్ ఇండియా ప్రాంగణంలోకి కూడా ప్రవేశించరాదని ఆదేశించింది. కాగా... రోహిత్ భాసిన్ ఎయిరిండియాలో సీనియారిటీ అనుసరించి ఈస్ట్రన్ డివిజన్ రీజనల్ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి వాలెట్ దొంగిలించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.