భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాపై పాకిస్తానీ నటి వీణా మాలిక్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సానియా తన కొడుకుకు హక్కా బార్కు తీసుకెళ్లి వాడి ఆరోగ్యం చెడగొడుతోందని తిట్టింది. దీంతో ఇద్దరి మధ్యా గొడవ రేగింది. సానియా తన భర్త షోయబ్ మాలిక్, కొడుకు ఇజాన్, మరో ఇద్దరు ఆటగాళ్లు వహాబ్ రియాజ్, ఇమాముల్ హక్లతో కలిసి ఓ హుక్కా బార్కు వెళ్లారని, సానియా హుక్కా తాగుతున్న సమయంలో తీసిన వీడియో అని పేర్కొంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అయితే కొద్దిసేపటికే ఆ వీడియోను డిలిట్ చేశాడు. ఆ వీడియో చూసిన వీణా మాలిక్ సానియా మీర్జాను ట్యాగ్ చేస్తూ ఉచిత సలహాలు పడేసింది.
‘సానియా.. మీ అబ్బాయి విషయంలో నేను చింతిస్తున్నాను. మీరంతా కలిసి ఆ చిన్నారిని హుక్కా బార్కు తీసుకెళతారా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నాకు తెలిసినంత వరకు మీరు వెళ్లిన బార్లో ఎక్కువగా జంక్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు. క్రీడాకారులైన మీరు, మీ భర్త ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఓ తల్లిగా మీకు ఈ విషయాలన్నీ తెలిసుండాలి’ అని పేర్కొంది.
కాగా వీణా మాలిక్ చేసిన వ్యాఖ్యలపై సానియా స్పందించింది. ‘ వీణా.. నేను నా కొడుకుతో ఏ బార్కూ వెళ్లలేదు. ఈ విషయాలన్నీ మీకు అనవసరం. నేను నా కొడుకు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. అది నాకు మాత్రమే తెలుసు. అలాగే పాకిస్తానీ క్రికెటర్లు ఏం తింటారు? ఎప్పుడు నిద్రపోతారు? అని పట్టించుకోవడానికి నేను పాక్ క్రికెట్ టీం డైటీషియన్ను కాదు. వారి తల్లిని కూడా కాను.. ప్రిన్సిపాల్నీ కాను.. టీచర్ను అంతకన్నా కాను. ఏదేమైనా మీరు మా పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఎవరో కొందరు నెటిజన్లు ఇలాంటి ట్వీట్లు చేస్తూ చిరాకు తెప్పిస్తుంటారు. మీరు ఇలాంటి విషయాలను వదిలేస్తే మంచిది’ అని సానియా కౌంటర్ ఇచ్చింది. ప్రపంచ కప్లో భాగంగా ఆదివారం జరిగిన భారత్, పాక్ మ్యాచ్లో పాక్ ఓటమి చవిచూసింది. దీంతో పాక్ అభిమానులు సానియా వల్లనే పాకిస్తాన్ ఓడిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.