సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. సచివాలయంలోని అయిదో బ్లాక్లో ఉన్న తన కార్యాలయంలో సోమవారం మంత్రి వనిత కార్యాలయ ప్రవేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గంలో ఎంతో కీలకమైన స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించడంపై మంత్రి వనిత ధన్యవాదాలు తెలిపారు. తనపై సీఎం జగన్ కున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా శాఖ పనితీరు మరింత మెరుగుపడేలా పనిచేస్తానన్నారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేస్తానని, వారి భద్రతకు కట్టుదిట్టమైన చట్టాలు తీసుకొస్తామని ఆమె వెల్లడించారు.