యశ్ బిర్లా గ్రూప్ ఛైర్మన్ యశోవర్ధన్ బిర్లాకు యూకో బ్యాంక్ షాకిచ్చింది. బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయనను ఎగవేతదారుడిగా ప్రకటిస్తూ.. యూకో బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. యశోవర్దన్ బిర్లా గ్రూప్కు చెందిన బిర్లా సూర్య లిమిటెడ్ కంపెనీకి బ్యాంకు రూ. 100కోట్ల రుణాలు మంజూరు చేసింది. అయితే ఈ రుణాలు చెల్లించకపోవడంతో 2013 జూన్ 3న ఈ ఖాతాను నిరర్ధక ఆస్తిగా ప్రకటించింది. దీంతో బ్యాంకుకు బిర్లా సూర్య కంపెనీ చెల్లించాల్సిన మొత్తం రూ. 67.55 కోట్లుగా ఉంది. అయితే ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఈ బకాయిలు చెల్లించకపోవడంతో ఛైర్మన్ యశోవర్ధన్ బిర్లాతో పాటు కంపెనీ డైరెక్టర్లు, ప్రమోటర్లు, హామీదారుల పేర్లను ఎగవేత దార్ల జాబితాలో చేరుస్తున్నట్లు బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. యశోవర్ధన్తో పాటు మరికొందరు వ్యాపారవేత్తల పేర్లను కూడా యూకో బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాలో చేర్చింది. దీని ప్రకారం.. సదరు రుణగ్రహీతలకు ఇకపై ఏ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సాయం లభించదు. అంతేగాక.. ఆయా కంపెనీలు కొత్త వెంచర్లు ప్రారంభించకుండా ఐదేళ్ల పాటు నిషేధం ఉంటుంది. రుణదాతలు కంపెనీ, డైరెక్టర్లపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టే వీలుంటుంది.