కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ ముగింపు మహోత్సవం సోమవారం అట్టహాసంగా కొనసాగుతోంది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్కుమార్శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించిన కిరణ్కుమార్ శర్మకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రయంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, స్వామి కిరణ్కుమార్ శర్మలకు ఇరువురు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ ఫలపుష్పాలు సమర్పించి.. ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఈ మహోత్సవానికి రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవంలో భాగంగా గత మూడురోజులుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి సమక్షంలో కృష్ణ తీరంలో యాగ, హోమ, దాన, పూజాదికాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పీఠాధిపతులు, వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా కిరణ్కుమార్ శర్మ సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం జరిగింది.