ఇంగ్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో భారత్ పాకిస్థాన్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ పై ఆ దేశ అభిమానులు విరుచుకుపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పాకిస్థాన్ జట్టును ఏకిపారేశారు. గుడ్ నైట్ బాయ్స్... అద్భుతమైన టీ కప్పుతో నన్ను నిద్ర లేపండి అని ఒకరు చురకలు అంటించారు. అసలు సర్ఫరాజ్ బ్యాట్ ఎందుకు పట్టుకున్నాడని ఇంకొకరు ప్రశ్నించారు. పలువురు కన్నీరు పెడుతూ, ఈ మ్యాచ్ చూడటం కష్టమని, విజయం సులువుకాదని తెలిసినా వచ్చామని తెలిపారు. పాక్ ఆటతీరు ఎంతో బాధను కలిగించిందని అన్నారు. ప్రస్తుతం భారత్ చాలా గొప్ప జట్టని, అటువంటి జట్టును ఇలాంటి ఆటతీరుతో గెలవడం కష్టమని పేర్కొన్నారు. కనీసం పోరాడకుండా కీలకమైన ఆటగాళ్లు పెవీలియన్ కు రావడాన్ని తట్టుకోలేకున్నామని వాపోయారు. కోహ్లీ ఒక్కడే 41 సెంచరీలు చేస్తే, తమ ఆటగాళ్లంతా కలిసి 41 సెంచరీలు చేశారని, ఇరు జట్ల బలాబలాలను బేరీజు వేసేందుకు ఇదొక్క ఉదాహరణే చాలని కొందరు సర్దిచెప్పుకున్నారు. మరి కొందరు వీరాభిమానులు మాత్రం వరుణుడు తమ ఆశలను తుడిచి పెట్టేసిందని తెలిపారు.