పెళ్లి జరిగిన తొలిరోజే, తనను పడకగదిలోకి వెళ్లనీయకుండా, పెళ్లికి వచ్చిన చదివింపుల వివరాలు చెప్పాలని డిమాండ్ చేసిన తండ్రిని, తీవ్ర ఆగ్రహంతో కడతేర్చాడో కుమారుడు. ఈ ఘటన తమిళనాడులోని అరియలూరు జిల్లా జయంకొండం సమీపంలోని ఆదిచ్చనల్లూరు గ్రామంలో జరిగింది. షణ్ముగం(48) కుమారుడు ఇళమది (23). ఇతనికి శుక్రవారం వివాహం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో బంధువులందరూ వెళ్లిపోయారు. వరుడి కుటుంబసభ్యులు కొంత మంది బంధువులు ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో షణ్ముగం కుమారుడు ఇళమదిని రమ్మన్నాడు. పెళ్లి ఖర్చు లెక్కలు చూడాలని, చదివింపు నగదు ఏ మేరకు వచ్చిందని, పోయి నగదు తీసుకురమ్మని చెప్పారు. ఆ సమయంలో ఇళమది మొదటి రాత్రికి సిద్ధమవుతున్నాడు. వధువు శోభనపు గదికి వెళ్లింది. ఇదిలా ఉండగా, తండ్రి షణ్ముగం తనకు లెక్కలు చూపి శోభనపు గదిలోని వెళ్లాలని కొడుకు ఇళమదిని మందలించాడు. అందుకు ఇళమది ఉదయాన్నే చూసుకుందామని చెప్పడంతో తండ్రి ఒప్పుకోకుండా ఇప్పుడే చూపాలని పట్టుబట్టాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. అందుబాటులో ఉన్న దుడ్డుకర్రతో కొడుకుపై షణ్ముగం దాడికి ప్రయత్నించడంతో, దాన్నే లాక్కున్న ఇళమది, తండ్రి తలపై బలంగా మోదాడు. దీంతో అతను స్పృహతప్పి పడిపోగా, బంధుమిత్రులు ఆసుపత్రికి తరలించారు.ఈలోగానే అతను మరణించగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఇళమదిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.