ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిట్ల దండ‌కంతో దిగి వ‌చ్చిన రైల్ల్వే!

national |  Suryaa Desk  | Published : Sun, Jun 16, 2019, 08:18 PM

రైళ్లలో మసాజ్‌ సేవలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదరవుతున్నాయి. ‘ఇప్పటికే రైళ్లల్లో అధిక రద్దీ వల్ల ప్రతిరోజూ మసాజ్ జరుగుతూనే వుంది.. ఇంకా కొత్తగా మసాజ్ ఏం చేస్తారు.. మసాజ్ మన సంస్కృతే కాదు.. ఇలాంటివి మనకు అవసరమా? వీలైతే రైళ్ల సంఖ్య పెంచండి.. ఇంకా ప్రత్యాన్మాయ మార్గాలు ఏమైనా వుంటే చూడండి..’ ఇలా రకరకాల కామెంట్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ క్రమంలో త్వరలో ప్రారంభించాలనుకున్న ఆ సేవల ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మసాజ్  ప్రతిపాదనలను విరమించుకున్నట్లు రైల్వే సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని.. మహిళల ముందు ఇలాంటి వెకిలి చేష్టలు అవసరమా? అని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఆమె ఇటీవల లేఖ రాశారు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపట్టారు. ఇండోర్‌కు చెందిన బీజేపీ ఎంపీ శంకర్‌ లాల్వానీ కూడా  గోయల్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి బయల్దేరే 39 రైళ్లలో ఈ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. తల, కాళ్ల మసాజ్‌కు రూ. 100 నుంచి రూ. 300 దాకా వసూలు చేయాలని భావించింది. దీనివల్ల అధికాదాయం సమకూరుతుందని రైల్వేశాఖ భావించింది. కానీ, సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గక తప్పలేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com