ఏళ్లతరబడి పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులోగల రూం నెంబర్ 135 వింటే చాలు... గతంలో ప్రభుత్వాలను వణికించిన, నిల బెట్టిన, పడగొట్టిన ఉదంతాలెన్నో గుర్తుకొచ్చి ఆయా పార్టీల నేతల ఒళ్లు గగుర్భాటు కలిగిస్తాయి. ప్రభుత్వాలను ఇరుకున పెడుతూ, జనంలోని సమస్యలను తమవిగా తీసుకుంటూ, వాటికి అనేక పరిష్కారాలు సూచించడంతో పాటు సిపిఎం పార్టీకి చెందిన అనేక వ్యూహాలను సాగించిన కీలక గదిని ఆ పార్టీ ఇప్పుడు ఖాళీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఆయా పార్టీలకు సంఖ్యాబలం ఆధారంగా ఆ పార్టీల పార్లమెంటరీ విభాగాలకు గదులను కేటాయిస్తారు. ఇందుకు కారణం ప్రస్తుతం సీపీఎంకు లోక్ సభలో ముగ్గురు, రాజ్యసభలో ఐదుగురు సభ్యులున్నారు. ఇంత తక్కువమంది సభ్యులున్న పార్టీకి రూం నెంబర్ 135 వంటి గదులను కేటాయించడం కుదరక పోవచ్చని సమాచారం. ఈ క్రమంలో రూం నెంబర్ 135 నుంచి సీపీఎంను ఖాళీ చేయించక తప్పడం లేదు. సీపీఎంకంటే అధిక సీట్లున్న పార్టీలకు ఆ గదిని కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. అదే జరిగితే, ఏళ్లతరబడి తనకు అచ్చొచ్చిన రూం నెంబరు 135ని సీపీఎం కోల్పోక తప్పదన్నట్టే.
నిజానికి 2014లోనే సీపీఎం చేతిలోంచి ఈ గది జారిపోయే పరిస్థితి రాగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి చేసిన విజ్ఞప్తితో పార్లమెంటరీ సెక్రటేరియట్ ప్రత్యేక కేసుగా పరిగణించి, రూం నెంబర్ 135ను సీపీఎంకు కొనసాగించింది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సభలోకి కొత్త పార్టీలు గణనీయ సంఖ్యలో సభ్యులతో అడుగు పెట్టడంతో కమ్యూనిస్టులు ఆ గది ఖాళృ చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.