ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేయడంతో.. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అడుగడుగునా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఉగ్రవాదులు నేపాల్ మీదుగా ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశమున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈనేపథ్యంలో అయోధ్యకు వచ్చే రైళ్లు, బస్సులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. లాడ్జ్, హోటల్స్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మరింతమంది భద్రతా బలగాలను దింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
5 జూన్ 2005న అయోధ్యలో జరిగిన ఉగ్రదాడి కేసు తుది తీర్పు జూన్ 18న రానుంది. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరికొందర్ని అరెస్ట్ చేశారు. మరోవైపు 18న శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఆ పార్టీకి చెందిన 18 మంది ఎంపీలు అయోధ్యకు రానున్నారు. దీంతో అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.