అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన శివసేన ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.