జెడియు- బిజెపిల మధ్య వివాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ త్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ఆమోదం తెలిపినా రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని, ఈ అంశంలోకు మద్దతు ఇవ్వబోమని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేయటంతో ఇదరి మధ్య ఎడబాటు మరింత దూరం పెరిగే అవకాశం ఉంది. జేడీయూ ట్రిపుల్ తలాక్ను వ్యతిరేకిస్తుందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ ఉండదని ఆ పార్టీ నేత, గురువారం బిహార్ మంత్రి షయం రజాక్ మీడియాకు తెలిపారు. ట్రిపుల్ తలాక్ సామాజికాంశమని, దీన్ని సమాజమే పరిష్కరించాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తమ పార్టీ అధినేత బిహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే బాహాటంగా వ్యతిరేకించిన సంగతి బిజెపి నేతలు గుర్తెరగాలని సూచించారు. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి అమలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి నిర్ణయాలను చర్చల ద్వారా లేదా కోర్టు తీర్పు ద్వారా పరిష్కరించాలని నితీష్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతికి తాము వ్యతిరేకమని నితీష్ స్పష్టం చేశారు. కాగా.. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ ట్రిపుల్ తలాక్ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గం నియామకాలలో లో జేడీయూకి తగిన ప్రాధాన్యం కల్పించకపోవడంతో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ తప్పుకుంటుందనే ఉహాగానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ట్రిపుల్ తలాక్ విషయంలో జేడీయూ అనుసరిస్తున్న విధానాలు ఆ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుండగా బిజెపి కూటమికి జెడియు తలాక్ చెప్పినా ఇబ్బందిలేదంటూ బిజెపి నేతలు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుండటం మరింత మంట పుట్టిస్తోంది.