మలేషియా బ్యాడ్మింటన్ స్టార్ లీ చాంగ్ వీ ఆటకు శాశ్వత వీడ్కోలు పలికాడు. గురువారం మీడియాతో లీ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. 19 ఏళ్లుగా సుదీర్ఘంగా బ్యాట్మింటన్ ఆడుతున్న తనకు క్యాన్సర్ సోకిందని.. అందుకే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని వెల్లడించాడు. కొన్నేళ్లుగా బ్యాడ్మింటన్లో నెంబర్ వన్గా లీ చాంగ్వీ కొనసాగారు. వైద్యుల సూచన మేరకు ఇక ఆటను కొనసాగించబోనని స్పష్టంచేశాడు. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా వుందని కంటతడి పెట్టుకున్నాడు. తప్పని పరిస్థితుల్లో వేరే అవకాశం లేదని అన్నాడు. ఇటీవల జపాన్లో వైద్యుల్ని సంప్రదిస్తే.. బ్యాడ్మింటన్ ఆడేందుకు తన శరీరం సిద్ధంగా లేదని వైద్యులు వెల్లడించినట్టు తెలిపాడు.
ఈ సందర్భంగా తనను ఎంతగానో అభిమానించి ఈ స్థాయికి తెచ్చిన కుటుంబ సభ్యులకు, ప్రోత్సహించిన కోచ్లకు, మలేసియా అభిమానులకు లీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. లీ 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో డి జనీరో ఒలింపిక్స్లో మూడు వెండి పతకాలు సాధించాడు. 2011 లండన్, 2013 గువాంగ్జౌ, 2015 జకార్తాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్ల ఫైనల్స్లో ఓటమి పాలయ్యాడు.