విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని శ్రీలంక చేరుకున్న ప్రధాని మోడీకి ఆదేశ ప్రధానమంత్రి రణీల్ విక్రమ సింఘే ఘన స్వాగతం పలికారు. అనంతరం ఈస్టర్ రోజున జరిగిన పేలుళ్ల మృతులకు ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. కొలంబోలోని సెయింట్ ఆంటోని చర్చిని సందర్శించిన ఆయన.. పేలుళ్ల దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లంకేయుల స్ఫూర్తిని టెర్రరిస్టుల క్రూరత్వం దెబ్బతీయలేదని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. శ్రీలంకకు మద్దతుగా భారత్ నిలుస్తుందన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సతో సమావేశం కానున్నారు.