రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ఆర్ధిక సహాయం అందించేలా ప్యాకేజి అంటూ గతంలో హడావిడి చేసిన బిజెపి నాయకులు, దాన్ని సక్రమంగా అందేలా చూడాలని సూచించారు ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తులసిరెడ్డి, ఈ మేరకు ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పి, నిధులను వెనక్కి తీసుకున్న ఘనత మోడీదేనని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు కేంద్రం బుందేల్ఖండ్ తరహాలో కానీ, ఒడిషా రాష్ట్రంలోని ‘కోరాపుట్-బోలంగీర్-కలహండి’ తరహాలో గానీ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ విషయమై గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్యాకేజీ కింద రూ.24,350 కోట్ల అంచనాలతో కేంద్రానికి నివేదిక పంపినా దానిపై స్పందించలేదని, కేవలం జిల్లాకు 50 కోట్ల చొప్పునా రూ.1,050 కోటుల మాత్రమే విడుదల చేసినట్టు చెపుతున్నా, దీనిలో పిఎంఓ ఆదేశాలతో నిధులు కేంద్రం వెనక్కి తీసుకుందని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏర్పడ్డ జగన్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి నిధులు విడుదల విషయమై రేపు రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీతో చర్చించాలని తులసిరెడ్డి సూచించారు.