అమరావతి –ఎపి ముఖ్యమంత్రి జగన్ తన క్యాబినేట్ కు తుది రూపు ఇచ్చారు.. మొత్తం 25 మంది మంత్రులు రేపు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మంత్రి వర్గాన్ని వినూత్న రీతిలో ఏర్పాటుకు జగన్ శ్రీకారం చుట్టారు. మంత్రి వర్గ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50 శాతం కేటాయించారు. ఇక అయిదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా ఉంటారని ఆయన స్వయంగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా చేయనున్నారు. ఇక ఆయన ఈ రోజు జరిగిన వైసిపి సి ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ, ఈ కొత్త మంత్రి వర్గం పదవీకాలం రెండున్నర ఏళ్లే అంటూ బాంబు పేల్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తేల్చి చెప్పారు జగన్ కొత్త అమాత్యులు రాజీనామాలకు సిద్దంగా ఉండాలని, ఆ తర్వాత వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంటే రెండున్నర ఏళ్ల తర్వాత రాజీనామా చేసిన వారి స్థానంలో మరో 20 మంది మంత్రులయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రి అయిదేళ్ల పదవీ కాలంలో కనీసం 45 మంది ఎమ్మెల్యేలకు మంత్రులయ్యే యోగం ఉందన్న మాట ఇక శ్రీకాకుళం జిల్లా అముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి.