అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్ ఐబీసీ) ప్రతి సంవత్సరమూ ఇచ్చే గ్లోబల్ లీడర్ షిప్ అవార్డుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఎంపికయ్యారు. 2019కి గాను సుందర్ పిచాయ్ తో పాటు నాస్ డాక్ ప్రెసిడెంట్ అడేనా ఫ్రైడ్ మాన్ ను ఎంపిక చేసినట్టు యూఎస్ ఐబీసీ పేర్కొంది. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు గానూ వారిని ఎంపిక చేసినట్లు మండలి పేర్కొంది. వచ్చే వారం జరగబోయే ఇండియా ఐడియాస్ సదస్సులో వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు.
గూగుల్, నాస్డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150శాతం మేర వృద్ధి చెందినట్లు యూఎస్ఐబీసీ వెల్లడించింది. కాగా, తనకు అవార్డును ప్రకటించిన సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందించారు. గూగుల్ కంపెనీకి భారత్ ఎంతో ముఖ్యమైన మార్కెట్ అని, తమ సంస్థ అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తోందని అన్నారు. టెక్నాలజీ అందుబాటుతో జీవన విధానం మెరుగుపడిందన్నారు. గూగుల్ సంస్ధ సైతం స్పందిస్తూ సీఈవో సుందర్ పిచాయ్కి అరుదైన గౌరవం దక్కడంపై హర్షం వ్యక్తం చేసింది.