కేబినెట్ భేటీ జరిగే సమయంలోనూ, సీఎం తో అధికారిక సమావేశాల్లోనూ ఎవరూ మొబైల్ ఫోన్లు వాడరాదని ఆర్డరేశారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్. కేబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు సీరియస్ గా డిస్కషన్ జరుగుతుంటే, కొంతమంది మంత్రులు స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ చాటింగ్ లు చేయటం ఆయన దృష్టికి వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం మొబైల్ ఫోన్లపై వాడకంపై నిషేధం విధించారు.
కేబినెట్ సమావేశాలు జరిగే సమయంలో.. చర్చ జరుగుతున్న సంబంధిత అంశంపై మంత్రులంతా శ్రధ్ధపెట్టి సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని సీఎం భావిస్తున్నారని, అందుకే మొబైల్ ఫోన్స్ పై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సీఎంఓ లోని సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
ఎలక్ట్రానికి పరికరాల హ్యాకింగ్, దుర్వినియోగాలకు పాల్పడే అవకాశం ఉన్న దృష్ట్యా కూడా ఈనిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు మంత్రులు సెల్ ఫోన్లు సైలెంట్ మోడ్ లో పెట్టి సీఎం సమావేశాల్లో పాల్గోనేవారు. ఇకనుంచి మంత్రులంతా సంబంధింత కౌంటర్లో తమ ఫోన్లు డిపాజిట్ చేసి రశీదు తీసుకోవాలి. మీటింగ్ అయిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది.