తనమీద ఎన్నికల కమిషన్ విధించిన బ్యాన్ ముగిసిన వెంటనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మరోసారి తన నోటికి పనిచెప్పారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రహ్మాన్ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. వారు బాబర్ సంతాన మంటూ విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఓ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన యోగి.. ’’ఒకసారి పార్లమెంట్లో ఆయనను కలిసి మీ పూర్వీకులు ఎవరని అడిగితే.. తాను బాబర్ సంతానమని చెప్పారు. ఆ సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది’’ అంటూ రహ్మాన్ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. వందేమాతరం పాడేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి.. బాబా సాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి మీ ఓట్లకు అనర్హుడంటూ యోగి పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల క్రితం అలీ, భజరంగ్ బలీ అంటూ యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నికల కమిషన్ మూడు రోజుల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.