పట్టుదల ఉంటే సాధ్యం కానిదేదీ లేదు. ఓ అంధుడు కెరటాలతో పోటెత్తే మహాసముద్రంలో ఏకంగా 14 వేల కి.మీ. దూరం ప్రయాణించి చరిత్ర సృష్టించారు. ఆ కడలిని నాన్ స్టాప్ ప్రయాణంతో దాటేసిన తొలి అంధుడిగా ఘనత సాధించాడు. జపాన్కు చెందిన మిత్సుహిరో ఇవామొటో(52)కు చూపు లేకపోయినా.. సముద్రవిహారం అంటే చాలా ఇష్టం. బ్రెయిలీ లిపి నేర్చుకున్నట్లే సెయిలింగ్ కూడా నేర్చుకున్నాడు. పడవను ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా ముందుకు నడిపించడంతో తీర్ఫీదు పొందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న కాలిఫోర్నియా నుంచి పసిఫిక్ మహా సముంద్రంలోకి చేరాడు. డోగ్ స్మిత్ అనే స్నేహితుడితో కలసి 40 అడుగుల పొడవున్న పడవలో నాన్ స్టాప్ ప్రయాణం సాగింది. పడవను మిత్సుహిరోనే నడిపేశాడు. డోగ్ అతనికి కొన్నిసార్లు సాయం చేశాడు. రెండు నెలలు ప్రయాణం తర్వాత ఈ రోజు(శనివారం) జపాన్లోని ఫకూషిమా పోర్టుకు చేరుకున్నాడు. అతనికి జపనీయలు ఘన స్వాగతం పలికారు. 2013లోనూ ఇవామొటో ఈ సాహసం చేశాడుగాని, ప్రయాణం మధ్యలో అతని పడవ.. తిమింగలాన్ని ఢీకొట్టి మునిగిపోయింది. జపాన్ నేవీ అతణ్ని కాపాడింది.