తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం క్యూలైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సినీయర్ నాయకుడు పి.చిదంబరం శివగంగా నియోజకవర్గంలో, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని పేనంపేటలో గల ఎస్ఐఈటీ కళాశాల పోలింగ్ కేంద్రంలో అదేవిధంగా డీఎంకే లోక్సభ అభ్యర్థి కనిమొళి చెన్నై ఆళ్వార్పేట పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. తమిళనాడు ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.